
హైదరాబాద్, వెలుగు: మందిరం, మసీదు, చర్చి ఏదైనా సరే ప్రభుత్వ స్థలాల్లో ఉండరాదని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో మీడియాతో మాట్లాడారు. బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయం ఎదురుగా ఉన్న జాగను కొంతమంది కబ్జాదారులు ఆక్రమించుకోగా, ఇటీవల ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని చెప్పారు.
దానిని ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించుకోవాలని తమ సర్కార్ ఆలోచన చేస్తుంటే.. కొంతమంది దేవుళ్లను తీసుకుపోయి ప్రభుత్వ స్థలంలో పెట్టి వివాదం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదన్నారు. తమది సెక్యులర్ ప్రభుత్వమే అయినా, దేవుడి పేర్లతో ఓట్లడిగేవాళ్లు రాజకీయాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. ప్రభుత్వ స్థలాలను ప్రజా అవసరాల కోసం ఉపయోగించే రీతి ఇది కాదని అసహనం వ్యక్తం చేశారు.
శివశంకర్, ముఖేశ్ గౌడ్ విగ్రహాలు పెడ్తం
హైదరాబాద్ సిటీలో త్వరలోనే కాంగ్రెస్ బీసీ నేతలు మాజీ కేంద్ర మంత్రి శివ శంకర్, రాష్ట్ర మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ విగ్రహాలు పెట్టాలని నిర్ణయించామని మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో చిట్చాట్లో తెలిపారు. పార్టీకి, బీసీలకు వారు చేసిన సేవలకు గుర్తింపుగా ఆ ఇద్దరు నేతల విగ్రహాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నామన్నారు. ఈ విషయంపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి ఎప్పుడు, ఎక్కడ పెడతామో చెప్తామన్నారు.